ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సామాజిక సేవలో పింఛన్దారుల పాత్ర కీలకమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అభిప్రాయపడ్డారు. ఆదివారం అఖిలభారత పింఛన్ దారుల సంఘం వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి హాజరయ్యారు. ముందుగా వార్షికోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ కేవలం ఉద్యోగానికే గాని సామాజిక సేవకు అడ్డు కాదని అన్నారు. పింఛన్ దారులు సమిష్టిగా కృషి చేస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చని అన్నారు. ఉద్యోగాలలో అందించిన సేవలను భవిష్యత్తులో కూడా సమాజానికి వినియోగపడాలని ఆశించారు. పింఛన్ దారులకు ఏ అవసరం ఉన్న తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, పింఛన్ దారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పెన్షన్ దార్లకు కంటి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో పెన్షన్ దార్లు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/pention.jpg)