ప్రజాశక్తి – పూసపాటిరేగ : మండలంలో సుమారు 1800 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారి నీలిమ తెలిపారు. మండలంలో పంట నష్టాన్ని శనివారం ఆమె పరిశీలించి, రైతులతో మాట్లాడారు. మండలంలోని 4900 వరకూ వరి పంట సాగయ్యిందని ఎఒ తెలిపారు. పంట కోతకొచ్చే సమయంలో తుపాను రావడంతో వరిపంట నేలపాలైందని చెప్పారు. తుపాను వస్తుందని ముందుగా హెచ్చరించినా, కోతలు కోయడం వల్ల ఈ నష్టం వాటిల్లిందన్నారు. సుమారుగా వెయ్యి ఎకరాల్లో గాలిదిబ్బలు నీటమునిగాయని వివరించారు. సుమారుగా 400 ఎకరాలు పనలు పొలంలోనే ఉండిపోవడంతో నీటిలో మునిగిపోయాయని తెలిపారు. 400 ఎకరాలు పూర్తిగా పోయినట్లేనని చెప్పారు. మరో 400 ఎకరాలు వరకూ పండిన పంట నేలకొరిగిందని తెలిపారు. ఈ పంట మరలా లేవదని, అది కూడా మొలకెత్తే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి తమ దృష్టికి వచ్చింది సుమారు 1800 ఉంటుందని, మరికొంత పెరిగే అవకాశం ఉందని, సర్వే పూర్తయ్యాక పూర్తివివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. రెల్లివలస, కుమిలి, లంకలపల్లిపాలెం, కొప్పెర్ల, వెంపడాం, గుంపాం తదితర ప్రాంతాల్లో ఎక్కవ నష్టం వాటిల్లిందని వివరించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/pprega-2.jpg)