ప్రజాశక్తి – చింతపల్లి : కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి, వైసిపి ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని, ఇండియా ఫోరం బలపరచిన అరకు పార్లమెంట్, పాడేరు శాసనసభ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ కోరారు. స్థానిక గిరిజన ఉద్యోగ భవన్ లో సిపిఐ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి అరకు పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి పి అప్పల నరస, పాడేరు నియోజకవర్గ శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థి శతక బుల్లిబాబు, సిపిఐ పార్టీ అల్లూరు జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణలతో కలిసి ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేస్తూ మన్య ప్రాంతంలో సహజ సిద్ధంగా నిక్షిప్తమై ఉన్న వనరులను దోచుకుపోయేందుకు రహదారులు” నిర్మిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించలేదన్నారు. మన్య ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు.ఇండియా ఫోరం బలపరిచిన అభ్యర్థుల విజయానికి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎర్ర బమ్మల ఎంపీటీసీ సభ్యుడు సేగ్గే సత్తిబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరమణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాగిన కృష్ణ పడాల్, సిపిఎం నేత ధనుంజరు, చిరంజీవి పాల్గొన్నారు.