ప్రజాశక్తి-పాడేరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ను విజయ వంతం చేయాలని సాధారణ పరిశీలకులు కె. వివేకానందన్ తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులకు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు స్థానిక గురుకుల కళాశాలలో నిర్వహించిన రెండవ విడత శిక్షణ ముగింపు కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను, వాట్సాప్ గ్రూపులలో ఉన్న పోలింగ్ ప్రక్రియపై రూపొందించిన వీడియోలను పరిశీలించి ఎన్నికల విధులను నిర్వహించాలని సూచించారు. పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ భావనా వశిస్ట్, అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి వి.అభిషేక్ మాట్లాడుతూ, బాధ్యతా యుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పారు. అధికారులు సమన్వయంతో పని చేసి పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో 242 మంది కి, అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజ వర్గం పరిధిలో 230 మందికి శిక్షణ అందించడం జరిగిందన్నారు. శిక్షణను సద్వనియోగం చేసుకోవాలని చెప్పారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి పాట్ నిర్వహణ, పి. ఓ డైరీ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఫారం 17సి, మాక్పోల్ సర్టిఫికేట్, బ్లాక్ కవర్ సర్టిఫికేట్లను నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, పిఓలు, ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.కమాండ్ కంట్రోల్ కేంద్రం పని తీరు భేష్పాడేరు:- జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమేండ్ కంట్రోల్ కేంద్రంలో వివిధ విభాగాల పని తీరును ఎన్నికల సాధారణ పరిశీలకులు కె.వివేకానందన్ ప్రశంసించారు. సోమవారం కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వివిధ విభాగాలను పరిశీలించారు. సోషల్ మీడియాలో ప్రచురితమైన ప్రకటనలు, స్క్రోలింగ్లు, పెయిడ్ న్యూస్, తదితర అంశాలపై ఆరా తీసారు. ఫిర్యాదుల విభాగం, బోర్డర్ చెకింగ్ వెబ్ లైవ్, ఎంసిసి ఉల్లంఘనలు, సీజర్స్ వాటిపై అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాలు నిర్వహిస్తున్న రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మరో వారం రోజుల పాటు కష్టపడి భాద్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్శనలో ఆయా విభాగాల అధికారులు ఎం.శివయ్య, సాయి నవీన్, పి.గోవిందరాజులు, పి.రాములు, రమేష్ కుమార్రావు, ఎల్.బి వెంకటరావు పాల్గొన్నారు.