ప్రజాశక్తి- అరకు రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలంలోని ఎండపల్లి వలసలో 1/ 70 చట్టాన్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యు, పంచాయితీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు, షాపులపై షాపులు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు ఎన్నికల బిజీలో ఉండటంతో ఇదే అవకాశం అని భావించి కొంతమంది గిరిజనేతరులు జోరుగా అక్రమ కట్టడాలు చేపడుతున్నారు.ప్రధాన రహదారి పక్కన బహుళ అంతస్తులు, దుకాణాల అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై గిరిజన ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు అరికట్టాలని ఎన్నిసార్లు సంబంధిత రెవెన్యూ అధికారులకు, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకునే నాధుడు కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు అరికట్టకపోతే జిల్లా కలెక్టర్, పాడేరు ఐటిడిఏ పిఓ దృష్టికి తీసుకెళ్తామని ఆదివాసి గిరిజన ప్రజా సంఘాలు తెలిపారు.