ప్రజాశక్తి-పాడేరు: కౌంటింగ్ సిబ్బంది, ఏజంట్లకు వేర్వేరుగా ప్రవేశాలు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏజంట్లు కౌంటింగ్ టేబుల్స్ వద్దకు వెళ్లకుండా వారికి కేటాయించిన స్థలంలోనే ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. స్ట్రాంగ్ రూముల తనిఖీలో భాగంగా శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాల్స్ ను పరిశీలించారు. పోలింగ్ ఏజంట్లకు ఏర్పాటు చేస్తున్న ఐరన్ మెస్ పనులు పూర్తి చేసి, సిసి కెమెరాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. ప్రతి హాలులో 14 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రదేశంలోను అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న భవనంలో మీడియా కేంద్రం ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో అరకు వ్యాలీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్, చింతూరు ఐటిడిఎ పిఒ చైతన్య, డిఆర్ఓ బి.పద్మావతి, గిరిజన సంక్షేమ ఇఇ డివిఆర్ ఎం రాజు, డిఇఇ అనుదీప్, పలువురు తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
![ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ సునీత](https://prajasakti.com/wp-content/uploads/2024/05/collee-1.jpg)