ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరోవిశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన రుషికొండలో ఉన్న డాక్టర్ బిఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. 2024 జూన్ 16న జరిగిన యుపిఎస్సీ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాల్లో ముగ్గురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కనపాల రాజామాత్యు (బిటెక్), సేరు తాతయ్య (బిఎస్సీ), స్వర్ణ స్నిగ్థ (బిటెక్) ఉత్తీర్ణత సాధించారు. గ్రూప్ -1 లోనూ 12 మంది ఉత్తీర్ణత…ఇటీవల విడుదలైనటువంటి గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ బ్యాచ్ విద్యార్థులు 12 మంది ఉత్తీర్ణత సాధించారు. గ్రూప్-2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ బ్యాచ్ విద్యార్థులు 80 మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, స్పెషల్ ఆఫీసర్ కె.రామారావు ఆధ్వర్యాన మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ విద్యార్థులను అభినందించారు. మొదటి బ్యాచ్ నుంచి ప్రతిభావంతుల వెతికితీత… 2022-23 ఫస్ట్ బ్యాచ్ మొదలుకొని ఇప్పటివరకూ 3 బ్యాచ్లకు విశాఖలోని డాక్టర్ బిఆర్?అంబేద్కర్ స్టడీసర్కిల్ కోచింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం 3వ బ్యాచ్ 2023 సెప్టెంబర్లో ప్రారంభించగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అర్హత పరీక్ష నందు సుమారుగా 100 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు/ స్పెషలాఫీసర్ కె.రామారావు ప్రజాశక్తికి తెలిపారు. ఇలా సెలెక్టు అయిన వారిలో 97 మంది కోచింగ్లో చేరారు. వారికి సెప్టెంబర్ 2023 నుంచి జూన్ 2024 సుమారు 10 నెలల పాటు యూపిఎస్సీ కోచింగ్ వివిధ సబ్జెక్టుల్లో ఇచ్చినట్లు రామారావు తెలిపారు. ముఖ్యంగా నుభవజ్ఞులైన ఉత్తమ అధ్యాపకులు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ నుంచి వచ్చి శిక్షణ ఇచ్చారని చెప్పారు. వీరి శిక్షణ కోసం సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కె.హర్షవర్థన్ (ఐఎఎస్), డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ విజయకృష్ణన్, జాయింట్ డైరెక్టర్ డి.శ్రీనివాసన్ కృషిచేశారు. మొత్తం శిక్షణ కోసం అకడమిక్ పర్యవేక్షించిన విజిటింగ్ కన్సల్టెంట్ డాక్టర్ యు.సుబ్రహ్మణ్యం, విశాఖ జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ ఎప్పటికప్పుడు తగు సూచనలు, సహకారాలు అందించినట్లు రామారావు పేర్కొన్నారు. ఇతర సీనియర్లు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చక్రపాణి, పంజాబ్ కేడర్ కరుణరాజ్ (ఐఎఎస్), శీనయ్య విద్యార్థులకు అమూల్య సలహాలు అదజేసి ప్రోత్సహించారు. సుమారు 10 నెలల వ్యవధిలో 48 మాక్ టెస్ట్లు నిర్వహించారు. రుషికొండ స్టడీ సర్కిల్లో అభినందనల వెల్లువ… ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించిన ముగ్గురు విద్యార్థులకు సీనియర్ ఐఎఎస్ అధికారులు విజయకృష్ణన్, వైజాగ్ స్టీల్ప్లాంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కరుణరాజ్ (ఐఎఎస్), రిటైర్డ్ ఐఎఎస్ చక్రపాణి విశాఖలోని రుషికొండ స్టడీసర్కిల్లో వీరందరినీ అభినందించారు.
![Ambedkar Study circle, prelimanary passed students](https://prajasakti.com/wp-content/uploads/2024/07/1-Ambedkar-study.jpg)