మోకాళ్లపై నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
ఎస్ఆర్ఐటి ఇంజ నీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కవిత ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్, ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, ఎఐఎస్బి జిల్లా కార్యదర్శి పృథ్వీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్యాదవ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఓబులేష్, జనసేన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధు మాట్లాడుతూ ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న కవిత ఉరేసుకోవడం బాధాకరమన్నారు. ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్ధు, గిరి, శివ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.