కలెక్టర్ గౌతమి
అనంతపురం కలెక్టరేట్ : సామాజిక సమతా సంకల్పంలో భాగంగా జన్ భాగిదరి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. సామాజిక సమతా సంకల్పంలో భాగంగా జిల్లాలో జన్ భాగిదరి కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లాలోని 663 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సిటిజెన్ల రిజిస్ట్రేషన్, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం, సోషల్ అవేర్నెస్ క్యాంపులు, ఫ్లెక్సీ బోర్డుపై సంతకాలు చేయడం లాంటి కార్యక్రమాలను పూర్తి చేసినట్లు చెప్పారు. 17న తేదీన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాలకు సుందరీకరణ, పూలమాల వేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 18న అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మానవహారాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో మారథాన్ రక్తదాన శిబిరాలు, జిల్లా స్థాయి ఫొటో ఎగ్జిబిషన్, సాంస్కతిక కార్యక్రమాలు, కలెక్టర్లను రెవెన్యూ భవనంలో జిల్లా సమావేశం నిర్వహించాలన్నారు. 19న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాన్ని అనంతపురం కలెక్టర్లోని రెవెన్యూ భవనంలో నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమాల విజయవంతానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను కలెక్టర్ ఎస్.గౌతమి తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలతో తులతూగుతూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.