దామోదరం జంజీవయ్యకు నివాళులు అర్పిస్తున్న జాయింట్ కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు అనంతపురం కలెక్టరేట్లో అధికారులు ఘన నివాళులు అర్పించారు. బుధవారం నాడు అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14వ తేదీన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెద్దపాడులో ఒక దళిత కుటుంబంలో జన్మించారన్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించారని కొనియాడారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. నిజాయితీగా ప్రజలకు సేవలందించడంతో పాటు ప్రజాహిత పాలన కోసం అనేక సంస్కరణలు అమలుచేసి అందరి మన్ననలను పొందారన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, బిసి వెల్ఫేర్ డిడి ఖుష్బు కొఠారి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం స్టేషన్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ ఎడి రామసుబ్బారెడ్డి, మార్కెటింగ్ ఎడి చౌదరి, క్రిస్టియన్ మైనారిటీ అధికారి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.