అధికారులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్
అనంతపురం కలెక్టరేట్ : సాధారణ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని జెఎన్టియులో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికలు-2024 కోసం కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో పార్కింగ్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్ మ్యాప్స్ సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఒ జి.రామకృష్ణారెడ్డి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్, ఆర్ఒలు జి.వెంకటేష్, వి.శ్రీనివాసులు రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, కరుణకుమారి, వసంతబాబు, వెన్నెల శీను పాల్గొన్నారు.