పోస్టర్లను విడుదల చేస్తున్న డివైఎఫ్ఐ నాయకులు
ప్రజాశక్తి-గుంతకల్లు
పట్టణంలో మూతబడిన స్పిన్నింగ్ మిల్లు స్థానంలో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం స్థానిక పొట్టి శ్రీరాములు కూడలిలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి దాసరి చరణ్కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఉపాధి లేక వేలాది మంది యువత ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తోందన్నారు. అంతేగాకుండా చదువులకు తగ్గ ఉద్యోగం లేక భవన నిర్మాణ, ఆటో కార్మికులుగా పని చేస్తున్నారన్నారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక వనరులు ఉన్నా వాటిని ఉపయోగించుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. పాలకుల అలసత్వం కారణంగా స్పిన్నింగ్ మిల్లు, తోళ్ల పరిశ్రమ, స్లీపర్ ఫ్యాక్టరీ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతబడ్డాయన్నారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. ఐటిఐ చదివిన విద్యార్థులకు పట్టణంలోనే అప్రెంటీస్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో భాగంగా ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకూ సంతకాల సేకరణ, సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 18న స్థానిక స్పిన్నింగ్ మిల్లు దగ్గర నుండి ఆర్డిఒ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సురేంద్ర, పట్టణ అధ్యక్షులు మద్దికర ప్రతాప్, నాయకులు చొక్కా సునీల్కుమార్, శ్రీనాథ్, మురళి, బాలు, తదితరులు పాల్గొన్నారు.