కార్ల్ మార్క్స్కు నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
ప్రపంచ మానవజాతి చరిత్రను మలుపుతిప్పిన మహోన్నత వ్యక్తి కార్ల్ మార్క్స్ అనిసిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్ర, 1వ నగర కార్యదర్శి రామిరెడ్డి కొనియాడారు. మార్క్స్ వర్థంతిని పురస్కరించుకుని గురువారం నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఎన్టీఆర్ ఆటోస్టాండ్లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ ఏంగిల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను రచించి ప్రపంచలోని కమ్యూనిస్టు పార్టీలకు ఒకమార్గాన్ని చూపారన్నారు. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని రెండు వందల సంవత్సరాల క్రితమే మార్క్స్ చెప్పాడంటే ఆయన మేథస్సు ఎంత గొప్పదో తెలుస్తుందన్నారు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చినా పెట్టుబడిదారులు మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ను చదివి దాని సారాంశాన్ని వంత పట్టించుకుంటున్నారని వివరించారు. ప్రస్తుత దుర్మార్గపు దోపిడీ వ్యవస్థ, సమర్థకులు, మార్క్సిజం మరణించిందని వాదిస్తున్నా ఇప్పటికీ ప్రపంచంలోని కోట్లాది కార్మికులు, పీడిత, తాడిత వర్గాలు, బడుగు, బలహీన వర్గాలు తమ విముక్తి కోసం మార్క్సిజం గురించి చర్చిస్తున్నారన్నారు. ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అన్న నినాదంతో కార్మిక వర్గాన్ని ఊర్రూతలు ఊగించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ఎన్టీఆర్ శ్రీనా, ప్రకాష్, వెంకటనారాయణ, ఎటిఎం నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు పరమేష్, భీమేష్, భగత్సింగ్ ఆటోడ్రైవర్ యూనియన్ నాయకులు శివ, సోమప్ప, భాస్కర్, రామకృష్ణ, రామాంజనేయులు, ప్రసాద్, హరి, శీనా, ఠాగూర్, వీరాలప్ప, తదితరులు పాల్గొన్నారు.