భిక్షాటన చేస్తున్న కార్మికులువేతనాలు చెల్లించాలని
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్
బకాయి ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ కోవిడ్, మలేరియా, గార్బేజ్, క్లాప్ ఆటో డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం భిక్షాటన చేశారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్లో విభాగాల వారీగా ప్రతి ఉద్యోగి సీటు వద్దకూ వెళ్లి కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని, మీకు తోచిన సహాయం చేయాలని ఉద్యోగులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు మాట్లాడుతూ ఉగాది పండగను దృష్టిలో ఉంచుకుని కమిషనర్ త్వరగా జీతాలు ఇవ్వాలని కిందస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. అయితే అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెడుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వేతనాలు చెల్లించకపోతే ఉగాది పండుగ సమయంలో కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందన్నారు. బకాయి జీతాలపై అధికారుల నిర్లక్ష్య వైఖరి మంచిది కాదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బకాయి వేతనాలతోపాటు ప్రతినెలా ఐదో తారీకు లోపు వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, రెగ్యులర్ నగర అధ్యక్షులు ఎల్.ముతురాజు, నగర అధ్యక్ష, కార్యదర్శులు సాకే తిరుమలేష్, బండారి ఎర్రిస్వామి, ఎం.ఆదినారాయణ, నారాయణస్వామి, కోవిడ్ మలేరియా గార్బేజ్ క్లాప్ ఆటోడ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు.