వృద్ధుడికి కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-వజ్రకరూరు
వైసిపి అధికారంలోకి వచ్చాక సిఎం జగన్ అందిస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి చూసి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం విడపనకల్లు మండల పరిధిలోని చీకులగురికి, కొట్టాలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. యువత పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఒకవైపు సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ సుపరిపాలన అందిస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై దోచుకోవడానికి చూస్తున్నాయని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం వచ్చాకే ప్రజల కష్టాలు తొలగాయని వివరించారు. ఒక్క చీకులగురికి గ్రామానికే నాలుగేళ్లలో రూ.25 కోట్ల లబ్ధి కలిగిందని వెల్లడించారు. సీఎం జగన్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. అనేక గ్రామాలకు రోడ్లు నిర్మించామన్నారు. మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండని అడిగిన ఏకైక నాయకులు దేశంలోనే జగన్ ఒక్కరే అన్నారు. ప్రజలు కూడా అన్నింటినీ చూడాలన్నారు. నాడు రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు కావాలో లేక మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 99 శాతం అమలు చేసిన జగన్ కావాలో నిర్ణయించుకోవాలని కోరారు. తర్వాత ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు వీరన్న, ఎంపిపి కరణం పుష్పావతి బీమ్రెడ్డి, జడ్పిటిసి హనుమంతు, వైస్ ఎంపిపి సునీతారాణి, మండల కన్వీనర్ కన్వీనర్ బసన్న, జెసిఎస్ కన్వీనర్ భరత్రెడ్డి, కొట్టాలపల్లి సర్పంచి లెజెండ్ రామాంజనేయులు, పిఎసిఎస్ ఛైర్మన్ శ్రీరాములు, నాయకులు కరణం భీమిరెడ్డి, మోదుపల్లి బాబు, ఉమాశంకర్, అంపయ్య, ప్రసాద్, రఘురాములు, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.