ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని ఐలవరం జెడ్పి ఉన్నత పాఠశాల్లో 2001-౦2 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమావేశం పాఠశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన అప్పటి విద్యార్థులు తాము చదివిన పాఠశాలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈపాటికే పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ద్వారా పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు కనపర్తి నిరీక్షణరావు, హెచ్ఎం మాచర్ల మోహనరావును షాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.