ప్రజాశక్తి – కొల్లూరు
నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి మనోజ్ కుమార్ కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష దేశ చరిత్రలో కనీ, విని ఎరగని రీతిలో ఈ ఏడాది అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టిఎను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మొరపెట్టుకున్నప్పటికీ స్పందన లేకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎన్టిఎను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు న్యాయం చేస్తానని, మరల నీట్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన ప్రకటన ఇవ్వకపోవడం బాధ్యతా రాహిత్యమని అన్నారు. పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం పేరట దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూసివేత ఆపాలని డిమాండ్ చేశారు. 4న దేశ వ్యాప్తంగా జరిగే బంద్ జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొనిగల సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Kolluru-SFI.jpg)