మాట నిలబెట్టుకున్న మంత్రి గొట్టిపాటి : దివ్యాంగునికి మూడు చక్రాల స్కూటర్ బహుకరణ

Jul 2,2024 01:01 ##Panguluru #tdp #Gottipati

ప్రజాశక్తి – పంగులూరు
మూడు చక్రాల స్కూటర్‌ను ఇస్తానని ఎన్నికలకు ముందు ఒక వికలాంగుడికి ఇచ్చిన మాట ప్రకారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్కూటర్‌ను బహుకరించారు. మండలంలోని రామకూరుకు చెందిన కొమరగిరి రత్తయ్య అనే వికలాంగునికి మూడు చక్రాల స్కూటర్ సోమవారం అందజేశారు. ఎన్నికలకు ముందు గొట్టిపాటి రవికుమార్ రామకూరు గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి చెందిన వికలాంగుడు కొమరగిరి రత్తయ్య తాను వైకల్యం వల్ల ఇబ్బంది పడుతున్నానని, నడవలేక పోతున్నానని, తనకు మూడు చక్రాల వాహనాన్ని ఇచ్చి ఆదుకోవాలని కోరాడు. ఎన్నికల అనంతరం కచ్చితంగా తాను మూడు చక్రాల వాహనాన్ని అందజేస్తానని రత్తయ్యకు రవికుమార్ హామీ ఇచ్చారు. ఆ మేరకు మూడు చక్రాల స్కూటర్‌ కొని, గ్రామ తెలుగుదేశం నాయకులు ద్వారా రత్తయ్యకు అందజేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు తెలుగుదేశం నాయకులు, పంచాయతీ ఉపసర్పంచ్ పెడవల్లి అశోక్, తెలుగు యువత నాయకుడు మానం వెంకట్రావు, సచివాలయ సిబ్బంది గ్రామంలోని గిరిజన కాలనీకి వెళ్లి వికలాంగుడైన కొమరగిరి రత్తయ్యకు మూడు చక్రాల స్కూటర్ అందజేశారు. తన సమస్యను గుర్తించి తనకు మూడు చక్రాల స్కూటర్‌ను పంపించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు, అందజేసిన తెలుగుదేశం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️