టిడిపి నాయకులతో ఎంఎల్‌ఎ గొట్టిపాటి సమీక్ష

Mar 7,2024 22:47

ప్రజాశక్తి – బల్లికురవ రూరల్
స్థానిక ఈర్లకొండలోని కిశోర్ గ్రానైట్ క్వారీ ప్రాంగణంలో మండలంలోని కొప్పెరపాడు, వల్లాపల్లి, వెలమవారిపాలెం, అంబడిపూడి, కొమ్మినేనివారి పాలెం, వైదన, కొప్పెరపాడు, ఎస్‌ఎల్‌ గుడిపాడు, సూరేపల్లి, రామాంజనేయపురం, గొర్రెపాడు, కూకట్లపల్లి, కొత్తూరు, వెలమవారిపాలెం గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత్ పేజీ నేస్తం సభ్యులతో ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ గురువారం సమీక్షించారు. తాజా రాజకీయాలు, ఓటరు జాబితా పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ పాలనతో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని అన్నారు. జగన్ రెడ్డి తన అసమర్ధ, స్వార్ధపూరిత విధానాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దెబ్బతీశారని అన్నారు. అందరూ ఐకమత్యంతో పనిచేసి సైకో ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని అన్నారు. లక్షలాది మంది సమక్షంలో ఇటీవల చంద్రబాబు ప్రకటించిన జయహో బీసీ డిక్లరేషన్‌తో వైసీపీ ప్రభుత్వానికి గుండెలు అదురు తున్నాయని అన్నారు. 140కిపైగా బీసీ కులాల్లోని ప్రతి వర్గాన్ని సంప్రదించి టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. బీసీల రిజర్వేషన్లు జగన్ రెడ్డి తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,700మంది బిసిలకు రాజ్యాంగ పదవులు దూరం చేశాడని అన్నారు. రూ.75వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లించాడని ఆరోపించారు.
బీసీ వర్గాల్లో చేతి వృత్తుల్ని నమ్ముకు న్నవారి కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేశాడని అన్నారు. ఆదరణ పనిముట్లు, పరికరాలను తుప్పుపట్టిపోయేలా చేయడానికి సిఎం జగన్‌ ఇష్టపడ్డాడుగానీ, బీసీలకు ఇవ్వలేదని అన్నారు. వైసిపి పాలనలో నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య సహా దాదాపు 300మంది బీసీ నేతల్ని దారుణంగా చంపించిన బీసీ ద్రోహి అని ఆరోపించారు. తన అక్కను ఏడిపిస్తున్నాడని అడ్డుకున్న చిన్నారి మణికంఠను పెట్రోల్ పోసి తగలబెట్టిన వైసీపీ దుర్మార్గుల దుర్మార్గాన్ని సమర్థించిన జగన్ రెడ్డి బీసీ వ్యతిరేక నైజాన్ని ఎప్పటికీ మరువకూడదని అన్నారు. కీలక పదవుల్ని బీసీలకే ఇచ్చామని, 70శాతం నామి నేటెడ్ పదవులు బీసీలతో నింపామని చెప్పారు. టీటీడీ ఛైర్మన్‌గా ఇప్పుడు జగన్‌రెడ్డి ఎవరిని నియమించారో, టీడీపీ ప్రభుత్వంలో ఎవరున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు నాడు పుట్టాసుధాకర్ యాదవ్, కాగిత వెంకట్రావు వంటి బీసీ నాయకుల్ని టీటీడీ ఛైర్మన్లను చేస్తే జగన్‌రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిని ఛైర్మన్లుగా నియమించిన ఘనుడని అన్నారు.
ప్రకాశం జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభించిన సిఎం జగన్‌రెడ్డి వెలుగొండ ప్రాజెక్టుపై జిల్లా ప్రజలను మరోసారి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన రెండు టన్నెళ్ళు పూర్తికాకుండానే నీళ్ళు ఇచ్చి జాతికి అంకితం చేశామని పైలాన్ ప్రారంభించిన జగన్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సరికాదని అన్నారు. వచ్చే జూన్, జూలై మాసంలోనే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు నీళ్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నిర్వాసితుల ఊసేలేకుండా వారికి ఇవ్వాల్సిన ఎస్ఏ, ఆర్ఆర్ ప్యాకేజీపై కానీ, పునరావాసంపై కానీ స్పష్టమైన ప్రకటన చేయకుండా నిధులు ఇస్తానని అనడం ఎన్నికల కోసం మభ్యపెట్టడమేనని అన్నారు.

➡️