ప్రజాశక్తి- గుడిపల్లి: ద్రావిడ విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రశాంతంగా యూజీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె.మధుజ్యోతి, రిజిస్ట్రార్ ఆచార్య ఏకె.వేణుగోపాల్ రెడ్డిలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. వర్సిటీలోని అన్ని విభాగాల్లో స్వయంగా వెళ్లి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, నిర్వహణలను గురించి పర్యవేక్షించారు. పరీక్షలు ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా పరీక్ష ఫలితాలు వెలువడిస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ పరీక్షలు ముగిసిన వెంటనే తదుపరి సెమిస్టర్ తరగతుల ప్రారంభం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రెక్టార్ ప్రొఫెసర్ టి.అనురాధ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు మొత్తం 541 మంది యుజి విద్యార్థులు, ఫిబ్రవరి 2వ తేదీ వరకు మొత్తం 192 మంది పిజి విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ అరవింద్ కుమార్, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్లు ప్రొఫెసర్ కె.శారద, ప్రొఫెసర్ లోకనాథ్ వల్లూరు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పి.నాగేశ్వర్ రావు ఉన్నారు.