- దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
- నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్
ప్రజాశక్తి-రాప్తాడు : రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడి సిగ్గుచేటని దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సోమవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సభకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్ పై విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడం అన్యాయం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవారు ఎలాంటి వారైనా ప్రజా కోర్టులో నిలబడాల్సిందేనని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడి పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.