ప్రజాశక్తి – సీతానగరం కాటవరం గ్రామంలో రూ.2.78 కోట్లతో, చినకొండేపూడిలో రూ.2.26 కోట్లతో నిర్మించిన రెండు విద్యుత్ ఉపకేంద్రాలను ఎంఎల్ఎ జక్కంపూడి రాజా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టిడిపి హయాంలో ఒక విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించిన దాఖలాలు లేవన్నారు. నేడు సీతానగరం మండలంలో మరో రెండు సబ్ స్టేషన్లు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కాటవరం విద్యుత్ ఉప కేంద్రం వల్ల కాటవరం, జాలిమూడి, మునికూడలి, కూనవరం గ్రామ ప్రజలకు, చినకొండేపూడి విద్యుత్ ఉప కేంద్రం వల్ల చినకొండేపూడి, రఘుదేవపురం, సీతానగరం, సింగవరం, చీపురుపల్లి, నాగంపల్లి గ్రామాలకి విద్యుత్ అందించడమే కాక వ్యవసాయ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాలను పూర్తిగా వాటి కెపాసిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుటూ, ప్రతి రైతుకూ ఉచితంగా పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం రఘుదేపురంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇఇలు టివిఎస్ఎన్.మూర్తి, దాట్ల శ్రీధర్ వర్మ, వై.డేవిడ్, డిఇలు చిట్టి రాజు, టివిఎస్.రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.