ఏలూరు అర్బన్:ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా కేంద్రంలో 9 మంది తలసేమియా బాధిత చిన్నారులకు శుక్రవారం రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్నది వేసవికాలం కనుక బ్లడ్ సెంటర్లలో రక్త కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 25 మందికి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మానవత సభ్యులు ఎంబి.శంకర రావు భోజనం ఏర్పాట్లు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పిఎఆర్ఎస్.శ్రీనివాస్, రెడ్ క్రాస్ కార్యదర్శి కెబి.సీతారాం పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/IMG-20240301-WA0103.jpg)