చెట్లతో మూసుకుపోయిన అన్నవరం మేజర్ కాల్వ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నాగార్జున సాగర్ కుడి కాల్వలు మరమ్మతులకు నోచక నీటి పారుదల ప్రశ్నార్థకమైంది. ఏడాదికి లేదా కనీసం రెండేళ్లకోసారి మేజర్ కాల్వలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా పూడిక పుల్ల తీసిన పాపాన పోలేదు. దీంతో కాల్వలన్నీ మట్టితో పూడుకపోవడంతో కంపచెట్లు పెరిగి నీటి పారుదలకు అడ్డంకిగా మారాయి. నాగార్జునసాగర్ కుడికాల్వ ఆయకట్టు పరిధిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొంత భూమితో కలిపి మొత్తం 11.80 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. 6.74 లక్షల ఎకరాల నీటి ఆధారిత భూమి ఉండగా 5 లక్షల ఎకరాలకు పైగా ఆరుతడి పంటలకు అనువైన సాగు భూములున్నాయి. మేజర్ కాల్వలకు అనుబంధంగా ఉన్న పంట కాల్వలను, బోదె కాలువలను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కింద మరమ్మతులు చేయిస్తుండగా కొన్ని ప్రాంతాల్లో రైతులే స్వచ్ఛందంగా బాగు చేసుకుంటున్నారు. కొన్ని పనులను చేయకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. నాగార్జున సాగర్ కుడి కాల్వ పరిధిలో లింగంగుంట్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కమిటీ సమావేశాలు సైతం జరగడం లేదు. సాధారణంగా మేలో మేజర్ కాల్వల మరమ్మతులు చేపట్టి జూన్ చివరి నాటికి నీరందించాల్సి ఉంటుంది. ఆ దిశగా చర్యలేమీ గతం నుండే లేవు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశంకామినేని రామరావు, కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు.తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేసిన సాగర్ జలాలు చెరువులకు అనుకున్న స్థాయిలో చేరలేదు. ఆ అనుభవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి కాల్వలకు మరమ్మతులు సత్వరమే చేపట్టాలి. ప్రస్తుతం బియ్యం ధరలు పెరిగిన దృష్ట్యా సాగునీరు సమృద్ధిగా అందిస్తే వరిసాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఇందుకనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.మరమ్మతులకు ప్రణాళికలుడి.వరలక్ష్మీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఇమేజర్ కాల్వల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందించాం. నూతన ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే పనులు చేయిస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి లభ్యత మేరకు సాగునీటి విడుదలపై ప్రకటన చేస్తాం.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/pnd-326.jpg)