ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : ఉత్తరాంధ్ర జిల్లాలలో అసైన్డ్ భూములను అక్రమంగా దోచుకున్న వ్యవహారంపై త్వరలోనే విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. విశాఖ టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల తీర్పుతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం ఆనందం కలుగజేసిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే కొంత మంది విమర్శలు ప్రారంభించారన్నారు. రుషికొండ భవనాలను ప్రజల అవసరాలు కోసం ఉపయోగిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని తెలిపారు. సమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమలశెట్టి శ్రీనివాసరావు, జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ కె. గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.