ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ప్రధాని మోడీతో మాట్లాడి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర మంత్రి పవన్ కల్యాణ్ చూడాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జీరావు కోరారు. స్టీల్ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక ప్రజాసంఘాల జెఎసి చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1170వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఆటో యూనియన్ కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ స్టీల్ప్లాంట్ ప్రాంతానికి వచ్చి కార్మిక సంఘాలు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా చూస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చాలని కోరారు. విశాఖ జిల్లా మోటారు ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు, వర్మ, కెవి.రమణ, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![Steel plant JAC Deekshalu](https://prajasakti.com/wp-content/uploads/2024/06/1-Steel-deekshalu.jpg)