గ్రీవెన్స్ లో అఖిలపక్ష సంతకాలతో పౌరసంఘం వినతి
ప్రజాశక్తి-కాకినాడ : కుళాయి చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్స్ సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్, కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లా కు పౌరసంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన అఖిలపక్షం వినతి పత్రాన్ని అందజేశారు. కరోనా లాక్ డౌన్ లో మూసి వేసిన జవహర్ వీధి గేటు తెరవక పోవడం వలన మోకాళ్ళ నొప్పులతో బాధపడే సీనియర్ సిటిజన్స్ చుట్టూ తిరిగి పార్కు లోకి వెళ్లి విశ్రాంతి పొందే అవకాశం భారం అవుతున్నదన్నారు. జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించడం వలన నేరుగా సేద తీరి త్వరగా గృహాలకు చేరే అవకాశం వుంటుంద న్నారు. ఇక్కడి ప్లాట్ ఫారం సైకిల్ ట్రాక్ ఖాళీగావుంటున్నందున వృద్దులు మహిళలు పిల్లలు సులభతరంగా ట్రాఫిక్ వెతలు లేకుండా ఉద్యానవన ఆహ్లాదాన్ని పొందే అవకాశం వుంటుందని తెలియ జేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ కమీషనర్ కు తెలిపి పార్కు ప్రవేశం కల్పిస్తామన్నారు.