ప్రజాశక్తి – సామర్లకోట
రాక్ సిరామిక్స్ కంపెనీ యాజమాన్యం తొలగించిన కార్మికులు రాష్ట్ర కార్మిక శాఖామంత్రి వాసంశెట్టి సుభాష్ను సోమవారం కలిశారు. 16 నుంచి 18 సంవత్సరాలుగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తమను అన్యాయంగా తొలగించారని కార్మికులు మంత్రికి వివరించారు. యాజ మాన్యం కక్షగట్టి కేవలం తెలుగు వారినే కంపెనీ నుంచి అకారణంగా తొలగిస్తుందని ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 4 దఫాలు లేబర్ కమిషనర్తో జాయింట్ మీటింగ్ జరిగినా యాజ మాన్యం నుంచి స్పందన రావడం లేదన్నారు. జెసిఎల్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధ:గా ఏ ఒక్క కార్మికుడిని పరిశ్రమ ఉంచి తొలగించడానికి వీల్లేదని, కార్మిక శాఖ ద్వారా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాక్ సిరామిక్స్ కంపెనీ గేటు ముందు కార్మికులు ఆందోళనను సోమవారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి.క్రాంతికుమార్, చంద్రశేఖర్, గంగాధర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు, పాల్గొన్నారు.