కొమరగిరిపట్టణంలో అదనపు తరగతి గదులను ప్రారంభిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్ ఎంపి చింతా అనురాధ తదితరులు
ప్రజాశక్తి-అమలాపురం
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలో మొగళ్ళమూరు బ్రిడ్జి నుండి- తూర్పులంక బ్రిడ్జి వరకు ఎపి ఆర్ఆర్పి నిధులైన సుమారు రూ.కోటి 91 లక్షలతో నిర్మించిన బిటి రోడ్డును మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధలు ప్రారంభించారు. అదేవిధంగా మొగళ్ళమూరు గ్రామం నందు గోగువారి పేటలో ఎంపీ లాడ్స్ నిధులైన రూ.30 కోట్లతో నిర్మించిన సిసి రోడ్డును వారు ప్రారంభించారు. ఒఎన్జిసి కాకినాడ సిఎస్ఆర్ నిధులైన రూ.35 లక్షల అంచనా వ్యయంతో తుమ్మలపల్లి గ్రామంలో నిర్మించదలసిన 60 వేల లీటర్ల తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి మనబడి నాడు నేడు పథకం కింద కొమరగిరిపట్టణంలో న్యాపతి సుబ్బారావు పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రూ.84 లక్షల నిధులతో నిర్మించిన మూడు అదనపు తరగతి గదులను మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ ప్రారంభించారు. బెండమూర్లంక రెబ్బనపల్లి సిసి రోడ్లు వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ మండల పరిధిలో కొమరగిరిపట్నం రోడ్డు తప్ప మిగిలిన అతి ప్రధానమైన రహదారులన్నింటినీ నిర్మించుకున్నామని అన్నారు. సిఎం జగన్ ఆధ్వర్యంలో నేడు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎంపీ చింతా అనురాద మాట్లాడుతూ కోనసీమలో తాగునీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించే దిశగా స్థానికంగా చమురు సహజవాయువుల నిక్షేపాలను వినియోగించుకుంటున్న ఒఎన్జిసి సిఎస్ఆర్ నిధులతో ప్రజల దాహార్తిని పూర్తి స్థాయిలో తీర్చేందుకు పలు ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో నాలుగు ట్యాంకులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంఎల్ఎ సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్, పురపాలక సంఘ వైస్ ఛైర్మన్ నాని రాజు, ఎంపిడిఒ కృష్ణమోహన్, తహశీల్దార్ ప్రసాదు, ఎంపిపి ఇళ్ళ శేషారావు, జెడ్పిటిసి సభ్యురాలు కె. గౌతమి ఎంపిటిసి సభ్యు డు మాకే కృష్ణమూర్తి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.