ప్రజాశక్తి-అమలాపురంరానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఇంటి నుంచే ఓటింగ్ విధానాలను చాలా స్పష్టతతో మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా 26 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తపాలా బ్యాలెట్ ఇంటి నుండే ఓటింగ్ సన్నద్దత చర్యలు అమలు విధానాల పై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులు ఉద్దేశించి మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ పోలింగ్ విధుల్లో హాజరయ్యే ఉద్యోగులు అత్యవసర సేవలలో నిమగమయ్యే సిబ్బంది జిల్లా కలెక్టర్ ద్వారా నిర్ధేశిత లిఖిత పూర్వక అనుమతులు పొందిన సిబ్బందికి తపాలా బ్యాలెట్లు ముద్రించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 85 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్, మంచానికి పరిమితమై నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులను బిఎల్ఒల సహకారంతో గుర్తించి వారికి ఇంటి నుండే ఓటు వేసే విధానాన్ని అమలు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ సిబ్బందిలో కొందరు ఇతర ప్రాంతాలు, జిల్లాల చెందిన ఉద్యోగులు న్నారని, వీరిని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానానికి ఓటింగ్ సౌకర్యాలు కల్పించి అనుమతించాలన్నారు. జిల్లా స్థాయిలో పోలింగ్ సిబ్బందికి శిక్షణలు కొనసాగు తున్నాయని తెలిపారు. అసెంబ్లీ స్థాయిలో కూడా రెండోసారి శిక్షణను ఇప్పించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. మే 12వ తేదీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రిని పోలింగ్ సిబ్బందిని సెక్టార్ అధికారి పర్యవేక్షణలో నిర్ధేశించిన రూట్లలో పోలింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు మే 13వ తేదీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని అన్ని విధాల సమాయత్త పరచాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి, రాజోలు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎస్.నుపూర్ అజరు, డిఆర్ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్ఒలు ఎ.మదన్మోహన్రావు, ఎ.శ్రీరామ్ చంద్రమూర్తి, ఆర్డిఒలు ఎస్.సుధా సాగర్, జి.కేశవర్ధన్ రెడ్డి, జివివి.సత్యనారాయణ, ఎం.ఝాన్సీ రాణి, డిఆర్డిఎ పీడీ వి.శివశంకర్ ప్రసాద్, డిపిఒ రాంబాబు పాల్గొన్నారు.