స్పందనలో ప్రజా సమస్యల పరిష్కారం

Feb 5,2024 22:47
స్పందనలో ప్రజా సమస్యల పరిష్కారం

ప్రజాశక్తి-అమలాపురం జగనన్నకు చెబుదాం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో అర్జీదారుల సంతప్తే ధ్యేయంగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోని గోదావరి భవన్‌లో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమాలను జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబులతో కలిసి జిల్లా స్థాయి నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కారించవలసిందిగా స్థానికంగా ఉన్న ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసారు. మండల స్థాయి నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత తహశీల్దార్లు, ఎంపిడిఒలు వర్చువల్‌ విధానంలో సంప్రదించి అర్జీదారులకు తగు పరిష్కార మార్గాలు చూపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 260 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన ప్రతి వినతినీ క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారిస్తూ నాణ్యమైన మార్గాలు అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో చూపుతూ స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమాల అమలు తీరు పట్ల అర్జీదారుల్ల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఒకే అంశంపై పదే పదే అర్జీలు నమోదు కాకుండా అర్జీల పరిష్కార సరళిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ అధికారు లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, డిపిఒ వి.కృష్ణకుమారి, డిఎస్‌ఒ ఎ.పాపారావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ మదన్‌మోహన్‌ రావు, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసు బాబు పాల్గొన్నారు.

➡️