ఉపాధి హామీ బకాయిల కోసం వినతి

Jul 1,2024 23:05
ఉపాధి హామీ బకాయిల కోసం వినతి

ప్రజాశక్తి – అమలాపురం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సంఘం ఆధ్వర్యంలో డిఆర్‌ఒకు వినతి పత్రం అందించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడారు. ఒక పక్క వ్యవసాయ పనులు లేవని, మరో పక్క యాంత్రీకరణ, రొయ్యల చెరువులు, రియల్‌ ఎస్టేట్‌గా వ్యవసాయ భూమి మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకుని వేలాది మంది కూలీలు జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం నెలల తరబడి వేతన బకాయిలు ఉంచడం తగదన్నారు. వెంటనే బకాయిలు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సఖిలే సూర్యనారాయణ పొలమూరి శ్రీనివాసరావు, పెట్టా ఆనందరావు, అనంతలక్ష్మి పాల్గొన్నారు.

➡️