ప్రజాశక్తి-అమలాపురం బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించాలని కోరుతూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఎంఎల్సి ఐ.వెంకటేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి.నరసింహారావు, అధ్యక్షుడు నారపల్లి రమణరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డిఎన్విడి.ప్రసాద్, రాష్ట్ర నాయకులు సుందరబాబు, ఈశ్వరరావు, నిట్ల శ్రీనివాస్, మోహన్రావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుర్గాప్రసాద్, బలరాం, స్కీమ్ వర్కర్ల రాష్ట్ర నాయకులు కృష్ణవేణి బందం మంత్రి సుభాష్కు సమస్యలను వివరించారు. దీనిపై మంత్రి సుభాష్ మాట్లాడుతూ పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న 12, 14 జిఒలను తక్షణమే రద్దు చేయడానికి అవసరమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలపై అవగాహన కోసం కార్మిక సంఘాలతో కార్మిక అధికారులతో కలిపి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తానని, ప్రస్తుతం సమస్యగా ఉన్న ఇసుక క్వారీల నిలుపుదలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా మెరుగైన సంక్షేమ పథకాలు అమలుకు చర్యలు చేపడతానని తెలిపారు. చంద్రన్న బీమాలో ఇబ్బందులను కూడా బృందం మంత్రి దృష్టికి తీసుకొచ్చింది.
![భవన నిర్మాణ బోర్డుపై మంత్రికి వినతి](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Untitled-1-copy-5.jpg)