షీల్డ్, మెమోంటో అందజేస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్
ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు ప్రభుత్వ గిరిజన గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు రాయలసీమ జోన్-4 విజేతలుగా నిలిచారని పాఠశాల ప్రిన్సిపల్ షాహినూర్, వ్యాయమ ఉపాధ్యాయులు ప్రతాప్ తెలిపారు. శనివారం వారు మాట్లాడారు. రాయలసీమ జోన్-4 స్థాయి పోటీలు ఇటీవల తిరుపతి జిల్లా రేణిగుంట గురుకుల పాఠశాలలో నిర్వహించారని తెలిపారు. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు గిరిజన గురుకుల పాఠశాలలు పోటీల్లో పాల్గొనగా కర్నూలు జిల్లా నుంచి 18కిపైగా జట్లు పాల్గొన్నట్లు చెప్పారు. ఈనెల 20న వాలీబాల్, ఖోఖో క్రీడల్లో ఫైనల్లో ఆలూరు విద్యార్థినులు విజేతగా నిలిచారని తెలిపారు. గెలుపొందిన జట్లకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఆలూరు వాలీబాల్, ఖోఖో క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 28న విజయనగరం జిల్లా కోనవలసలో జరగనున్నట్లు తెలిపారు.