ప్రజాశక్తి-బలిజిపేట: క్రీడా సంస్కృతిని, క్రీడా స్ఫూర్తిని గ్రామ స్థాయి నుండి పెంచడానికి, తద్వారా ఆరోగ్యకర జీవనశైలి పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆడుదాం ఆంధ్ర కన్నా గొప్ప వేదిక ఉండబోదని ఎస్టి కమిషన్ చైర్మన్ డి.వి.జి.శంకరరావు తెలిపారు. మండలంలోని పెదపెంకి పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడలలో డి.వి.జి శంకరరావు బుధవారం పాల్గొన్నారు. ఆరోగ్య సమాజం సాధనలో ఈ కార్యక్రమం కీలకం కానుందని ఆయన చెప్పారు. కార్పొరేట్ చదువుల్లో క్రీడలకు కనీస ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల భౌతికంగా, మానసికంగా వారు బలహీనులుగా తయారవుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో శారీరక ఆరోగ్యం పట్ల, ఫిట్ నెస్ పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచడానికి ఆడుదాం ఆంధ్ర తోడ్పడగలదన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ అప్పలరాజు, ఎంఇఒ సామల సింహాచలం, సర్పంచ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/bjpt-3.jpg)