సమ్మె బాటలో సమగ్ర శిక్ష ఉద్యోగులు

Dec 20,2023 19:52

పార్వతీపురంరూరల్‌ : విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌ టైం, ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద సర్వ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ జెఎసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు ఎ.పొలినాయుడు, కె.భారతి, బివి రమణ, బి.ఈశ్వరరావు, తదితరులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని ముఖ్యమంత్రి గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన నేటికీ అమలు చేయలేదన్నారు. ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్‌, గ్రాడ్యుటీ, పిఎఫ్‌ వంటి సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచినప్పటికీ సమగ్ర శిక్షలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచకపోవడం సమంజసం కాదని అన్నారు. సుప్రీంకోర్టు సూచన ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వ శిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న ఈ విభాగంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదన్నారు. నిర్దిష్ట కాలం ప్రాతిపదికన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మెడికల్‌ లీవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ చేసే వరకు మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో ఇప్పటికే అనేక దశల్లో ఆందోళన చేపట్టామని, అయినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేని నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఉద్యోగుల గోడు తెలియజేయడం కోసం రాష్ట్రవ్యాప్త సమ్మెను చేపట్టామని తెలిపారు. ఎంఇఒ, కెజిబివిల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల సిబ్బంది, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రస్థాయి జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి సమ్మెను విరమించేలా చర్యలు చేపట్టాలని, లేనిచో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు సిహెచ్‌ భాను ప్రకాష్‌, ఎ.దివాకర్‌, జి.రమేష్‌, వై.గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️