వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి : ఎమ్మెల్యే

Jul 1,2024 21:34

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కోట వరకు నిర్వహించిన స్టాప్‌ డయేరియా ర్యాలీని ఆమె ప్రారంభించారు. డయేరియా ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు డయేరియా సోకే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకొని డయేరియాను దరిచేరనీయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఎంఎం నాయుడు, సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కొండపల్లి సాంబమూర్తి, ప్రజారోగ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు..

➡️