ప్రజాశక్తి-ఆనందపురం : ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ మిందివానిపాలెం సమీపం వీతం కళాశాల రోడ్డులో గల సాలోడు చెరువును ఆక్రమించి రియల్ ఎస్టేట్ దారులు అక్రమంగా నిర్మించిన గోడపై రెవెన్యూ అధికారులు నోటీసు అంటించారు. వారం రోజుల్లో తొలగించాలని హుకుం జారీచేశారు. మిందివానిపాలెం సర్వే నెంబరు 347లో సుమారు 452 ఎకరాల విస్తీర్ణం చెరువు గయాలు ఉంది. ఈ స్థలాన్ని అనుకొని 319/1 లో సుమారు 8 ఎకరాలు విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నాలుగు రోజులుగా గోడ నిర్మాణ పనులు చేపట్టడంపై పత్రికల్లో వచ్చిన కథనాలు, గ్రామస్తుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు స్పందించారు. తహశీల్దార్ హేమంత్ కుమార్, ఆర్ఐ మణికంఠ, విఆర్ఒ వరలక్ష్మి ఆక్రమణ స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ గోడను వారం రోజుల్లో తొలగించకపోతే తామే కూల్చుతామని కట్టిన గోడపై నోటీసును అంటించారు.
![Occupied land, verified](https://prajasakti.com/wp-content/uploads/2024/06/1-Revunue.jpg)