- – రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం
ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : బాధ్యత గల పౌరునిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రైడ్ ఫర్డెమోక్రసీ అనే థీమ్తో ఓటు ప్రాధాన్యతను తెలియచేసేలా ఆదివారం సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రాధాన్యత గలవని తెలుసుకోవాలన్నారు. ఓటు విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఓటు మద్యానికో, డబ్బుకో, మరో దానికో అమ్ముకోకూడదని అన్నారు. ఓటు వినియోగంలో నిర్లిప్తత పనికిరాదని, నిర్లిప్తత అనేది ఎంతో ప్రమాదకరమైనదన్నారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్నవారు ఓటు హక్కు వినియోగంలో నిర్లిప్తత కలిగి ఉంటున్నారని ఇటువంటి ధోరణి అసలైన ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందన్నారు. ఓటు విలువ అనేది మన బతుకులకు ముడిపడి ఉందని తెలుసుకోవాలన్నారు. బాధ్యత గల పౌరులుగా ఓటు హక్కుని వినియోగించు కోవాలన్నారు. ఈ సైకిల్ ర్యాలీలో 150 మంది సైక్లిస్టులు పాల్గొనగా రొటేరియన్లు, డాక్టర్లు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, మహిళామణులు, పాల్గొన్నారు.