జగన్‌ ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి : ఎంఎల్‌ఎ సౌమ్య

Jun 16,2024 21:31

ప్రజాశక్తి – నందిగామ : తన ఇంట్లో దాచుకున్న విలువైన ఫర్నిచర్‌ను, వస్తువులను మాజీ సిఎం జగన్‌ ప్రభుత్వానికి అప్పజెప్పాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తాడేపల్లిలో జగన్‌ తన సొంత ఇంటి కోసం.. నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటిని సీఎం క్యాంప్‌ కార్యాలయంగా మార్చుకుని, దీని కోసం సుమారు రూ.కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. దోచుకుని దాచుకున్న జగన్‌ ఇంట్లోని ఫర్నీచర్‌.. విలువైన వస్తువులను ప్రభుత్వానికి లెక్కచెప్పి అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు.అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ, సోపా తన క్యాంప్‌ కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఆయనను దొంగగా ముద్ర వేసి. ఆత్మహత్య చేసుకునేలా చేశారని సౌమ్య మండిపడ్డారు. జగన్‌ క్యాంపు నివాసానికి సెక్యూరిటీ, ఫర్నీచర్‌ రూపేణా రూ.3 కోట్ల 63 లక్షల వ్యయం చేసిన జీవోను కూడా బయటకు తీశారు. 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు తన క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను జగన్‌ ఎందుకు వెనక్కి పంపలేదని నిలదీశారు.

➡️