- – సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి –
- ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ప్రజాశక్తి – నందిగామ : అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నందిగామలో నందిగామ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక కెవిఆర్ కళాశాలలో జరుగుతున్న పిఒ, ఎపిఒల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్, వీడియోల ప్రదర్శన ద్వారా వివిధ అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్కు ముందు రోజు, పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత నిర్వహించాల్సిన విధులను వివరించారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను స్వయంగా క్షుణ్నంగా వివరించారు. 17 ఏ రిజిస్టర్, పీవో డైరీ, విజిట్ షీట్, ఫారం-14ఏ జాబితా, మాక్పోల్, పోల్, అసైన్డ్ ఓటర్లు, మార్క్డ్ కాపీ ఓటర్లు, సీయూ-1 ఓటర్లు, సీయూ-2 ఓటర్లు, క్లియరింగ్ మాక్పోల్ డేటా, క్లోజ్ బటన్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం, వీవీప్యాట్స్ తదితర ముఖ్యమైన అంశాలపై కలెక్టర్ డిల్లీరావు వివరించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదునందిగామ ఆర్వో స్థాయిలో సేవలందిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలనతో పాటు పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో 9,636 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు వివరించారు. 6న కూడా ప్రక్రియ సజావుగా జరగ్గా 7,8 తేదీల్లోనూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోల స్థాయిలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు (వీఎఫ్సీ) పనిచేస్తాయన్నారు. ఈ నెల 7, 9 తేదీల్లో ప్రత్యేక బృందాల ద్వారా హోం ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హోం ఓటింగ్ సౌకర్యం పొందేందుకు 1,052 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఫారం-12డీ సమర్పించిన వైద్యులు, ఆర్టీసీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితర అత్యవసర సేవల సిబ్బందికి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని కేంద్రీకృత పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ)తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోల స్థాయిలోనూ పీవీసీల ద్వారా ఓటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కలెక్టర్ వెంట ఆర్వో ఇ.కిరణ్మయి, నందిగామ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీవో, ఆర్వో ఎ.రవీంద్రరావు ఉన్నారు.