తలలో నుండి భారీ కణితి తొలగింపు

Apr 13,2024 22:33
  • – బాల్యం నుంచి తల భాగంలో గడ్డతో బాధ పడుతున్న రోగి
  • వరుణ్‌ కార్డియాక్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌లో విజయయవంతంగా శస్త్రచికిత్స
  • ఆపరేషన్‌ అనంతరం వేగంగా కోలుకున్న మోహన్‌రామ్‌

ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : నగరంలోని వరుణ్‌ కార్డియాక్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ నందు అద్భుతం ఆవిష్కతమైంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను ప్రఖ్యాత న్యూరో సర్జన్‌ డాక్టర్‌ పువ్వాడ రామకష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని వరుణ్‌ కార్డియాక్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ నందు శనివారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో డాక్టర్‌ పువ్వాడ రామకష్ణ మాట్లాడుతూ.. ‘గుడివాడకు చెందిన మోహన్‌ రామ్‌ (40) తల భాగంలో గడ్డతో చిన్న వయసు నుంచి బాధ పడుతున్నారు. గడ్డ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ, బయటి వ్యక్తులకు తన పరిస్థితి తెలీకుండా టోపీ పెట్టుకునేవాడు. అయితే, ఈ గడ్డ క్రమక్రమంగా పెరుగుతూ అత్యంత భారీ కణితిగా తయారైంది. కణితి రోజురోజుకూ పెరిగిపోతూ, పుర్రె ఎముకలను దెబ్బతీయడంతో మెదడుపై ఒత్తిడి తీవ్రమై పేషెంట్‌ భరించలేనంత నొప్పి బాధపడ్డాడు. ఆ పరిస్థితుల్లో రోగి, వరుణ్‌ కార్డియాక్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌లో సంప్రదించాడు. 18 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ ట్యూమర్‌ను వైద్యులు గుర్తించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి, పుర్రె భాగాన్ని ఆపరేషన్‌ ద్వారా ఓపెన్‌ చేసి, అతి భారీ కణితిని విజయవంతంగా తొలగించామని వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌ అనంతరం రోగి వేగంగా కోలుకున్నాడన్నారు. ప్రపంచంలోనే ఈ ఆపరేషన్‌ అత్యంత అరుదైనదన్నారు. ఇది క్యాన్సర్‌ కణితి కాదని తెలిపారు. పేషెంట్‌ మోహన్‌ రామ్‌ మాట్లాడుతూ ‘సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యను శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించిన డాక్టర్‌ పువ్వాడ రామకృష్ణ నాకు పునర్జన్మను ప్రసాదించారన్నారు. డాక్టర్‌ పువ్వాడ రవితేజ, అనస్థీషియా విభాగం వైద్యులు డాక్టర్‌ సూర్య, డాక్టర్‌ దీప్తిలకు వరుణ్‌ కార్డియాక్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుంటూరు వరుణ్‌ అభినందనలు తెలిపారు.

➡️