మందుబాబులపై కొరడా
ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఎ.రవి శంకర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కె.ఫక్కీరప్పల ఆధ్వర్యంలో నగరంలో శనివారం రాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. జోన్ – 1, 2 పరిధిల్లో 75 బృందాలను ఏర్పాటు చేసి మందుబాబులపై కొరడా ఝులిపించారు. పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి 383 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. జోన్ -1 పరిధిలో ఫోర్ వీలర్స్ను తాగి నడుపుతున్న 17 మందిపైనా, టూ వీలర్స్ నడుపుతున్న 148 మందిపైనా, ఆటోలు నడుపుతున్న 17 మందిపైనా వెరసి 183 మందిపై కేసులు నమోదు చేశారు. జోన్ – 2 పరిధిలో టూ వీలర్స్ 175, ఆటోలు 10, ఫోర్ వీలర్స్ 14, ఒక కమర్షియల్ వాహనంపై దాడులు నిర్వహించి 200 మంది వాహనదారులు తాగి వాహనాన్ని నడుపుతున్నట్టు గుర్తించారు. వారందరిపైనా కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిపి, జెసిపి మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ సమయంలో మద్యానికి దూరంగా ఉండాలన్నారు. అప్రమత్తంగా ఉండి తద్వారా వాహనదారులు, పాదచారుల భద్రత కాపాడాలని కోరారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైలు శిక్షలూ ఉంటాయన్నారు.
సిపి పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులు