రూ.450 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువుల సీజ్
సున్నిత ప్రాంతాల్లో పటిష్ట నిఘా
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్దే ఫారం 12ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ అక్కడికక్కడే ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం ఈనెల 7,8 తేదీల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెఎన్టియు గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించారు. ఓటింగ్కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్లు, క్యూలెన్లు, పోలింగ్ బూత్లను సందర్శించారు. ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏర్పాట్లపట్ల ఉద్యోగులు సిఇఒ వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పోస్టల్ ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను, ఎన్నికలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి వివరించారు. ఈ సందర్భంగా సిఇఒ మీనా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, ఓటు కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్కు తీసుకువెళ్లి, ఓటు పొందవచ్చునని సూచించారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తయ్యిందన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, ప్రలోభాలను అరికట్టేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.450కోట్లు విలువైన నగదు, మద్యం, విలువైన పరికరాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, ప్రతీ మండలంలో మండల అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేసి, మద్యాన్ని ఎక్కడికి రవాణా చేస్తున్నదీ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 12,400 సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్, కేంద్ర బలగాలను వినియోగించడం, మైక్రో అబ్జర్వర్ల నియామకం, వీడియో గ్రఫీ తదితర చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇవే కాకుండా రాజకీయంగా సున్నితంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టామని, వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ రోజు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పర్యటనలో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఒ ఎస్డి అనిత, పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ కె.సందీప్కుమార్, డిఆర్డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, ఎస్సి కార్పొరేషన్ ఇడి సుధారాణి, జెడ్పి డిప్యుటీ సిఇఒ కె.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.