ప్రజాశక్తి- కడప అర్బన్ మున్సిపల్ సిబ్బందికి వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎస్బిఐ ఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నగర అధ్యక్షులు సుంకర రవి 20 తరాల పైబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్లో మున్సిపల్ కార్మిక, సిబ్బంది కలిపి 2000 మంది జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థ వరకు ట్రెజరీ సంబంధిత లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒకటిన్నరేళ్లుగా వ్యక్తిగత రుణాల కోసం మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఏదైనా అత్యవసర పరిస్థితులలో కానీ, శుభకార్యం విషయం కానీ డబ్బు అవసరమైనప్పుడు స్థానిక ఆసాముల వద్ద వడ్డీకి తీసుకోవాల్సి దుస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఐదు రోజుల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపకుంటే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కంచుపాటి తిరుపాల్, శ్రీధర్ బాబు, సుంకర కిరణ్ కుమార్, నాగరాజు, ధరణి, బుజ్జి, ఇత్తడి ప్రకాష్, కార్మికులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకు వ్యక్తిగత రుణాలివ్వాలి- ఎస్బిఐ ఆర్ఒ కార్యాలయం ఎదుట ఆందోళన
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Untitled-1-copy-1.jpg)