వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
పెనుకొండ : ఆర్డిటికి నిధులు ఆపేయడాన్ని బహుజన చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తోందని ఆసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, హై కోర్టు న్యాయవాది శివరామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని డిఎఒ బాబుకి బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం శివరామకృష్ణ మాట్లాడుతూ ఆర్డిటికి నిధులు ఆపేయడం హేయమైన చర్య అన్నారు.ప్రజల సంక్షేమం, సమాజ అభివృద్ధి సాధించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే విఫలమవుతాయో అప్పుడు పేదల ఆకలి తీర్చడానికి సమాజ అభివృద్ధికి స్వచ్చంద సంస్థలు పుట్టుకొస్తాయన్నారు. అలా ఏర్పడ్డ సంస్థే ఆర్డీటీ అన్నారు. అనేక దశాబ్దాలుగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసిల సంక్షేమం కోసం పని చేస్తున్న ఆర్డీటీకి నిధులు రావడాన్ని ఆపడం అన్యాయమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాల్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు ఏ వెంకటేషులు, ప్రధాన కార్యదర్శి రవికుమార్, రాంపురం రామాంజనేయులు, శెట్టిపల్లి నరసింహులు, అండ్రుస్, ధనుంజరు, పెనుకొండ బాబు, రామకృష్ణ, రంగేపల్లి కదిరెప్ప తదితరులు పాల్గొన్నారు.