మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట
కదిరి టౌన్: పట్టణాభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సోమవారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎక్స్ అప్సియో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ నజీమున్నీసా హాజరు కాకపోవడం శోచనీయమన్నారు. నాయకత్వం లేని వ్యక్తులు ఎన్నిక కాబడితే సమస్యలు తలెత్తుతాయన్నారు. రాజకీయంగా ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు కానీ పట్టణ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామన్నారు. ఒకే రకమైన సిద్ధాంతంతో పనిచేస్తున్నామని మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలను అరికట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ను కౌన్సిలర్లు, అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి భైరవ ప్రసాద్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు టిడిపి, జనసేన, నాయకులు తదితరులు పాల్గొన్నారు.