రిలే నిరాహార దీక్షలో పంచాయతీ కార్మికులు
పరిగి : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలకు కార్మికులు సిద్ధమయ్యారు. వీరి పోరాటానికి సిఐటియు నాయకులు అండగా నిలిచి వారి పక్షాన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. పరిగి మండల కేంద్రంలోని సచివాలయం వద్ద పంచాయతీ కార్మికులతో పాటు స్వచ్ఛభారత్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు రమేష్ మాట్లాడుతూ పరిగి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న 10నెలలు వేతనాలు చెల్లించాలని, 11 నెలలు అరియర్స్ ఇవ్వాలని, కనీస సౌకర్యాలు నూనె, సబ్బులు ,చెప్పులు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సజ్జరాయప్ప , కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ముర్తప్ప, రామంజి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.