కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేస్తున్న వామపక్ష నాయకులు
ప్రజాశక్తి- పలాస
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లాభం తప్ప రైతులకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు, రైతాంగానికి ఒరిగేది ఏమీలేదని, ఒక్క మాటలో చెప్పాలంటే రైతు కార్మిక బడ్జెట్ కాదని కార్పొరేట్లు బడ్జెట్ అని వామపక్ష రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష, రైతు కార్మిక సంఘాల ఆద్వర్యాన ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా శనివారం నిరసన తెలిపారు. ఈ మేరకు బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్బంగా వామపక్ష నాయకులు కోనారి మోహనరావు, చాపర వేణుగోపాల్, మద్దిల రామారావు, గోరకల బాలకృష్ణ, బొడ్డు వాసుదేవరావు మాట్లాడుతూ బడ్జెట్ వల్ల పేదలకు ఏమి లాభం లేదన్నారు. కొత్త పథకాలు ఏవి లేవని, ఆదాయ పన్ను శ్లాబ్లు యథాతథంగా కొనసాగిస్తూ పాత స్కీమ్లనే కొనసాగిస్తున్నారని అన్నారు. రైతులకు పీఎం కిసాన్ సాయం పెంచలేదన్నారు. ఆహారం, ఎరువులు రాయితీల్లో 8 శాతం తగ్గిందని, నిత్యవసర వస్తువులు రేట్లతో పాటు పెట్రోలు, డీజీలు, గ్యాస్ రేట్లు తగ్గే పరిస్థితి లేదన్నారు. విద్య, వైద్య రంగానికి నిధులు కుదించారన్నారు. రాష్ట్రాలకు నిధులు కేటాయింపులో కుదించారన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సంబంధించి ఒక్క మాటా మాట్లాకపోవడం దారుణమన్నారు. రైతులకు సంబంధించిన ఎరువులు, విత్తనాలు సబ్సిడీలు గురించి గానీ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో గాని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వీటిపై బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సిహెచ్.రవి, జి.వాసు బొడ్డు విజయ, పిన్నింటి.నాగేశ్వరరావు, కోనారి ఈశ్వరమ్మ, పోతనపల్లి బాలరాజు, రాపాక.మాధవరావు. బర్ల గోపి తదితరులు పాల్గొన్నారు.