మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు
ప్రజాశక్తి – పలాస
తుపాను, కరువుతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని వామపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాశీబుగ్గలోని ఒక ఫంక్షన్ హాలులో వామపక్షాలు, రైతుసంఘాల ఆధ్వర్యాన సిపిఐ నాయకులు చాపర వెంకటరమణ అధ్యక్షతన సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాల్లేక పంటలు నష్టపోగా, ఎంతోకొంత మిగిలిన పంటలు చేతికొస్తున్న సమయంలో తుపాను తుడిచిపెట్టిందన్నారు. జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కల్పించి, రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొబ్బరి, మునగ అంతర పంటలకు తోడ్పాటును అందించాలని కోరారు. వంశధార కుడి కాలువ ద్వారా సాగునీటిని శివారు ప్రాంతాలకు అందించాలని, కాలువను ఇచ్ఛాపురం వరకు పొడిగించాలన్నారు. జీడి ప్రాసెసింగ్లో పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వలసలను అరికట్టేందుకు ఉపాధి హామీని 200 రోజులు పనిదినాలకు పెంచి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఎన్.గణపతి, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు ఎం.మల్లేశ్వరరావు, న్యూడెమోక్రసీ నాయకులు ఎం.భీమన్న, రైతుసంఘం నాయకులు హడ్డి మాష్టారు, జీడి రైతుసంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.